నింగిలోకి ‘అన్వేష’.. ఇస్రో ప్రయోగంలో అంతరాయం

నింగిలోకి ‘అన్వేష’.. ఇస్రో ప్రయోగంలో అంతరాయం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ62 రాకెట్‌ ప్రయోగంలో అంతరాయం ఏర్పడింది. దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన ‘ఈఓఎస్‌-ఎన్‌1’ లేదా ‘అన్వేష’ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి మోసుకెళ్లిన ఈ రాకెట్‌లో సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని ఇస్రో (ISRO) ఛైర్మన్‌ వి.నారాయణన్‌ వెల్లడించారు. ఈ ప్రయోగం మొత్తం నాలుగు దశల్లో పూర్తి కావాల్సి ఉంది. అయితే, మూడో దశ వరకు సాఫీగానే సాగిందని, ఆ తర్వాత కొంత అంతరాయం ఏర్పడిందని తెలిపారు. మూడో దశ చివర్లో రాకెట్‌ నిర్దేశించిన మార్గంలో వెళ్లలేదని పేర్కొన్నారు. సమస్యకు గల కారణాలను విశ్లేషించి మరిన్ని వివరాలను ప్రకటిస్తామని చెప్పారు.

శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి సోమవారం ఉదయం 10.18 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ62 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ‘ఈఓఎస్‌-ఎన్‌1’తో పాటు భారత్, యునైటెడ్‌ కింగ్‌డమ్, థాయ్‌లాండ్, బ్రెజిల్, స్పెయిన్, నేపాల్‌ తదితర దేశాలకు చెందిన మరో 14 చిన్న ఉపగ్రహాలు కూడా మోసుకెళ్లింది. అయితే, వీటిని కక్ష్యలోకి ప్రవేశపెట్టే సమయంలో ఈ అంతరాయం ఏర్పడింది. 2026లో ఇస్రో (ISRO) చేపట్టిన తొలి ప్రయోగం ఇదే.

న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌ఎస్‌ఐఎల్‌) చేపట్టిన 9వ పూర్తిస్థాయి వాణిజ్య మిషన్‌ ఇది. ఈ మిషన్‌లో ప్రధాన ఉపగ్రహం ఈఓఎస్‌-ఎన్‌1. రక్షణ, పరిశోధన, అభివృద్ధి సంస్థ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ హైపర్‌ స్పెక్ట్రల్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహం, సరిహద్దుల్లో నిఘాకు, వ్యవసాయం, విపత్తుల నిర్వహణకు ఉపయోగపడనుంది.