9న ఈనాడు 50, ఈటీవీ 30 వసంతాల వేడుకలు

9న ఈనాడు 50, ఈటీవీ 30 వసంతాల వేడుకలు

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: తెలుగువారి ప్రియ పుత్రిక ‘ఈనాడు’ దినపత్రిక 50 వసంతాలు పూర్తి చేసుకుంది. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. ఈటీవీ.. మీటీవీ అంటూ మూడు దశాబ్దాలుగా ఈటీవీని తెలుగు ప్రజలు అక్కున చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఈనాడు 50, ఈటీవీ 30 వసంతాల వేడుకలకు గుంటూరు వేదిక కాబోతోంది. ఈనెల 9న స్తంభాలగరువులోని చేబ్రోలు    హనుమయ్య గ్రౌండ్స్‌లో ఈ వేడుకలు సాయంత్రం 6 గంటల నుంచి జరగనున్నాయి. సినీ గీతాలు, డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌లతో ఉర్రూతలూగించేలా పలు కార్యక్రమాలు దీనిలో ఉంటాయి. వేడుకలకు ప్రత్యేక అతిథిగా ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌  హాజరవుతున్నారు. సినీనటుడు నందు యాంకర్‌గా వ్యవహరిస్తారు. తమన్‌ బృందం సంగీత విభావరితో ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నారు. సినీ గాయనీగాయకుల గాన మాధుర్యంతో ఆద్యంతం వినోదభరితంగా సాగే ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే పాస్‌లు తప్పనిసరి.

రేపు పాస్‌ల పంపిణీ

  • జనవరి 8న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చేబ్రోలు హనుమయ్య గ్రౌండ్స్‌ వద్ద పాస్‌లు పంపిణీ చేస్తారు. 
  • పాస్‌తో పాటు ప్రత్యేక ఆకర్షణగా ఇచ్చే రిస్ట్‌ బ్యాండ్‌లను ధరించిన వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది.