తిరుమలలో కనుల పండువగా గోదా కల్యాణోత్సవం

తిరుమలలో కనుల పండువగా గోదా కల్యాణోత్సవం

 తిరుమలలో వైభవంగా గోదా కల్యాణోత్సవం నిర్వహించారు. గురువారం రాత్రి తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ప్రాంగణంలోని మైదానంలో ఈ వేడుక కనుల పండువగా సాగింది. కల్యాణాన్ని వీక్షించిన వేలాది మంది భక్తులు తన్మయత్వం చెందారు. తొలుత శ్రీకృష్ణస్వామి, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులను అలంకరించి కల్యాణ వేదికపై వేంచేపు చేశారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు కీర్తనలు ఆలపించారు.

గోవింద నామ సంకీర్తనలతో గోదా కల్యాణం : అనంతరం తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో శ్రీవిష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణం, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. గోవింద నామ సంకీర్తనలతో గోదా కల్యాణం ముగిసింది. ఈ సందర్భంగా ఎస్వీ సంగీత కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన గోదా కల్యాణం నృత్యరూపకం ఆద్యంతం అలరించింది. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, ఎస్పీ సుబ్బారాయుడు, సీవీఎస్‌వో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

తిరుమలలో రద్దీ- అలిపిరి వద్ద ట్రాఫిక్​ జామ్​ : వరుస సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. సంక్రాంతి పండుగ అనంతరం శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తిరుమలకు వెళ్లే వాహనాలు బారులు తీరాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ లెక్క చేయకుండా భక్తులు తరలివస్తున్నారు శుక్రవారం సర్వదర్శనానికి సంబంధించి 10వేల ఉచిత టోకెన్లను తితిదే జారీ చేసింది. సంక్రాంతిని పురస్కరించుకొని తిరుపతిలోని కపిల తీర్థం వద్ద పెద్దలకు, పూర్వీకులకు తర్పణాలు వదిలేందుకు నగరవాసులు బారులు తీరారు.