క్రిమినల్ సిండికేట్లా లాలూ కుటుంబం.. ఐఆర్సీటీసీ స్కాంపై దిల్లీ కోర్టు
భూ కుంభకోణం కేసుపై విచారణ జరిపిన దిల్లీ కోర్టు ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Yadav family) కుటుంబంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఐఆర్సీటీసీ కుంభకోణంలో లాలూ కుటుంబం క్రిమినల్ సిండికేట్లా వ్యవహరించిందని పేర్కొంది. ఈ కేసులో తమను నిర్దోషులుగా విడుదల చేయాలని లాలూ కుటుంబం వేసిన పిటిషన్ ఆమోదయోగ్యం కాదని వెల్లడించింది. సీబీఐ అధికారులు దాఖలు చేసిన ఛార్జిషీట్ను, సాక్ష్యాధారాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం లాలూ కుటుంబసభ్యులను, సహాయకులను కుట్రదారులుగా పేర్కొంది.
లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, కుమార్తె మిసా భారతితో సహా ఆయన కుటుంబ సభ్యులు ఉద్యోగానికి బదులుగా భూమిని స్వాధీనం చేసుకున్నట్లు బలమైన ఆధారాలు ఉన్నాయని దిల్లీ కోర్టు (Delhi court) పేర్కొంది. ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణంలో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్తో పాటు ఇతరులపై అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు నమోదు చేసింది.
2004-2009లో లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టుల కేటాయింపులో అవినీతి జరిగిందనే ఆరోపణలు (land for jobs scam) వచ్చాయి. ఆ కాంట్రాక్టులను సుజాత హోటల్కు అప్పగించారు. ఆ ఒప్పందానికి బదులుగా లాలూప్రసాద్ యాదవ్ ఓ బినామీ కంపెనీ ద్వారా ఖరీదైన ప్రాంతంలో మూడు ఎకరాల భూమిని పొందారని సీబీఐ పేర్కొంది. ఈ వ్యవహారంలో లాలూ, ఆయన భార్య రబ్రీదేవీ, కుమారుడు తేజస్వీ యాదవ్తో పాటు మరో 11 మందిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీంతో మోసం, కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద ట్రయల్ కోర్టు లాలూ కుటుంబంపై అభియోగాలు మోపింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ లాలూ దిల్లీ కోర్టును ఆశ్రయించారు.


Pratiroju 




