ఒలింపిక్స్-2036 నిర్వహణకు భారత్ సన్నద్ధమవుతోంది: ప్రధాని మోదీ
ఒలింపిక్స్-2036 క్రీడలను నిర్వహించేందుకు భారత్ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. గత పదేళ్లలో అంతర్జాతీయ క్రీడలకు భారత్ వేదికగా నిలిచిందన్నారు. వారణాసిలో 72వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్ పోటీల ప్రారంభోత్సవంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
గత దశాబ్ద కాలంలో భారత్లో 20కిపైగా అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించామని గుర్తుచేశారు. అండర్ - 17 ఫిఫా వరల్డ్కప్, హాకీ వరల్డ్ కప్, చెస్ టోర్నమెంట్ వంటి అంతర్జాతీయ ఈవెంట్లకు భారత్ విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చిందన్నారు. 2030లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ కూడా భారత్లోనే జరగనున్నాయని తెలిపారు. 2036లో ఒలింపిక్ క్రీడల కోసం భారత్ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోందని చెప్పారు.
భారత్ అభివృద్ధి వృత్తాంతాన్ని ప్రధాని మోదీ వాలీబాల్ ఆటతో పోల్చారు. ఏ విజయమైనా ఒక్కరి వల్ల సాధ్యం కాదనే విషయాన్ని ఈ క్రీడ తెలియజేస్తుందని, మన సమన్వయం, విశ్వాసం, జట్ల సంసిద్ధతపైనే మన విజయం ఆధారపడి ఉంటుందన్నారు. ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర, బాధ్యత ఉంటుందని, వాటిని నెరవేర్చినప్పుడే మనం విజయం సాధిస్తామన్నారు.
జనవరి 4 నుంచి 11 వరకు జరగనున్న ఈ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్లో దేశవ్యాప్తంగా 58 జట్లకు చెందిన వెయ్యికిపైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ పోటీలతో వారణాసి నగరం జాతీయ స్థాయి క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా మారుతుందని వాలీబాల్ ఛాంపియన్షిప్ నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.


Pratiroju 




