డాక్టర్‌ సుధాకర్‌ కుమారుడికి ఉద్యోగం.. కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం: అనిత

డాక్టర్‌ సుధాకర్‌ కుమారుడికి ఉద్యోగం.. కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం: అనిత

 వైకాపా ప్రభుత్వ హయాంలో వేధింపులతో మృతిచెందిన డాక్టర్‌ సుధాకర్‌ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌కు హోంమంత్రి అనిత ధన్యవాదాలు తెలిపారు. సహకార శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సుధాకర్‌ కుమారుడు లలిత్‌ప్రసాద్‌కు ఉద్యోగ హోదా పెంచి గ్రూప్‌-2 సేవల కింద రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దారుగా నియమించింది. ఈ నేపథ్యంలో అనిత స్పందించారు. 

మాస్క్‌ అడిగినందుకు జగన్‌ ప్రభుత్వం ఆనాడు సుధాకర్‌ను ఎంతలా చిత్రహింసలకు గురిచేసిందో ప్రజలంతా చూశారని అనిత అన్నారు. ఆయనతో పాటు ఆ కుటుంబం పడిన మానసిక వేదనను ప్రత్యక్షంగా చూశానని గుర్తుచేశారు. జగన్‌ దురహంకారానికి బలైన సుధాకర్‌ను తిరిగి తీసుకురాలేమని.. ఆయన కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్‌ ఉద్యోగం ఇవ్వాలని క్యాబినెట్‌ నిర్ణయించడం దళితుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు బాధ్యత తీసుకుని సుధాకర్‌ కుటుంబానికి న్యాయం చేశారన్నారు.