భారత్‌లో క్రిప్టో నిబంధనలు మరింత కఠినం

భారత్‌లో క్రిప్టో నిబంధనలు మరింత కఠినం

డిజిటల్‌ ఆస్తుల మార్కెట్‌లో చట్ట విరుద్ధ కార్యకలాపాలను తొలగించే ప్రయత్నంలో భాగంగా, భారతదేశ ఆర్థిక నిఘా విభాగం (ఎఫ్‌ఐయూ) క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీల కోసం కఠినమైన కొత్త యాంటీ-మనీ లాండరింగ్‌ (ఏఎంఎల్‌), నో యువర్‌ కస్టమర్‌ (కేవైసీ) ప్రోటోకాల్‌లను ఆవిష్కరించింది. వీటిలో ఆన్‌బోర్డింగ్‌ ప్రక్రియ సమయంలో తప్పనిసరి లైవ్‌నెస్‌ డిటెక్షన్‌ (లైవ్‌ సెల్ఫీలు), భౌగోళిక ట్రాకింగ్‌ (జియో ట్యాగింగ్‌) వంటివి ఉన్నాయి. ఈ నెల 8న జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, క్రిప్టో ఎక్స్ఛేంజీలను వర్చువల్‌ డిజిటల్‌ అసెట్‌ (వీడీఏ) సర్వీస్‌ ప్రొవైడర్లుగా వర్గీకరించారు. ఇప్పుడు వీడీఏలు సాధారణ డాక్యుమెంట్‌ అప్‌లోడ్‌లను అనుమతించడంతో పాటు మరిన్ని పనులు చేయాల్సి ఉంటుంది.

కొత్త నిబంధనల ప్రకారం, వినియోగదారులు తమ ఉనికిని ధ్రువీకరించే ‘లైవ్‌ సెల్ఫీ’ తీసుకోవాలి. సాధారణంగా కళ్లు రెప్ప వేయడం లేదా తల కదలిక ద్వారా ఈ చర్య స్టాటిక్‌ ఫొటోలు లేదా డీప్‌ఫేక్‌ల వాడకాన్ని నిరోధించడంలో సాయపడుతుంది. వినియోగదారు ఖాతాను సృష్టించడం ప్రారంభించిన కచ్చితమైన అక్షాంశం, రేఖాంశం, తేదీ, సమయ ముద్ర; ఐపీ చిరునామాను ఎక్స్ఛేంజీలు నమోదు చేయాల్సి ఉంటుంది. ‘పెన్నీ-డ్రాప్‌’ పద్ధతి అవసరం. దీనిలో బ్యాంక్‌ ఖాతా యాక్టివ్‌గా ఉందని, రిజిస్ట్రన్ట్‌కు చెందినదని నిర్ధారించడానికి నామమాత్రపు రూపాయి లావాదేవీని ప్రాసెస్‌ చేస్తారు. పాన్‌ (శాశ్వత ఖాతా సంఖ్య)తో పాటు వినియోగదారులు పాస్‌పోర్ట్, ఆధార్‌ లేదా ఓటరు ఐడీ వంటి సెకండరీ ఐడీని, ఇ-మెయిల్‌ ఐడీ, ఫోన్‌ నంబరు కోసం ఓటీపీ ధ్రువీకరణను అందించాలి.