23, 26 తేదీల్లో సిట్ ముందు హాజరును మినహాయించండి - కోర్టును ఆశ్రయించిన మిథున్​రెడ్డి

23, 26 తేదీల్లో సిట్ ముందు హాజరును మినహాయించండి - కోర్టును ఆశ్రయించిన మిథున్​రెడ్డి

వైఎస్సార్సీపీ నేత మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ - కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌కు ఆదేశం - తదుపరి విచారణ రేపటికి వాయిదా

 వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణం కేసు రోజు రోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ క్రమంలో ఆనాటి నేతలు అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల పలువురు వైఎస్సార్సీపీ నేతలకు ఈడీ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 23న విచారణకు రావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తాజాగా వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అయితే మినహాయింపు కోరుతూ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్​పై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ జరిపింది.

తనకు ఈ నెల 23, 26 తేదీల్లో సిట్ దర్యాప్తు అధికారి ముందు హాజరు నుంచి మినహాయింపు కోరుతూ మిథున్​ రెడ్డి పిటిషన్​ దాఖలు చేశారు. కౌంటర్​ దాఖలు చేయాలని సిట్​ను ఆదేశించిన న్యాయస్థానం తదుపరి విచారణను రేపటి (బుధవారం)కి వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రోనక్​ కుమార్​, అనిల్​ చోక్రాల బెయిల్​ పిటిషన్లపై విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. నిందితుడు రోనక్​ గుంటూరు, అనిల్ చోక్రా విజయవాడ జిల్లా జైళ్లలో జ్యుడీషియల్​ రిమాండ్​లో ఉన్నారు.

మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి మనీలాండరింగ్‌ చట్టం కింద అభియోగాలతో గతేడాది మేలో ఈడీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఈసీఐఆర్‌)ను నమోదు చేసింది. 33 మందిని అందులో నిందితులుగా చేర్చింది. 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో గత సంవత్సరం సెప్టెంబరులో సోదాలు చేసి, కీలక ఆధారాలు సేకరించినట్లు సంబంధిత అధికారులు తెలుపుతున్నారు.