ఎడిట్‌ చేసిన ఫొటోలు వైరల్‌.. క్రికెటర్ ప్రతీకా రావల్ సీరియస్‌

ఎడిట్‌ చేసిన ఫొటోలు వైరల్‌.. క్రికెటర్ ప్రతీకా రావల్ సీరియస్‌

మహిళల వన్డే వరల్డ్‌ కప్‌ (ICC Womens ODI World Cup)లో అద్భుత ప్రదర్శన చేసిన టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్‌ ప్రతీకా రావల్‌ (Pratika Rawal) ‘ఎక్స్‌’లోని ఏఐ ప్లాట్‌ఫామ్‌ గ్రోక్‌ (Grok)పై సీరియస్ అయ్యారు. తన ఫొటోలను ఎడిట్ చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తుండటంపై తీవ్రంగా స్పందించారు.

‘‘నాకు సంబంధించిన ఫొటోలను ఎడిట్ చేయడానికి గ్రోక్‌కు ఎలాంటి అధికారం లేదు. నా ఫొటోలను ఎడిట్ చేయాలని ఏదైనా థర్డ్ పార్టీ అడిగితే.. ఆ అభ్యర్థనను తిరస్కరించండి’’ అని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఎలాన్‌ మస్క్‌ (Elon Musk)కు చెందిన ఏఐ చాట్‌బాట్‌ గ్రోక్‌ (Grok) ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గ్రోక్‌ను వాడి కొందరు అసభ్య, అశ్లీల, చట్టవిరుద్ధ కంటెంట్‌ను సృష్టిస్తున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మస్క్‌ స్పందించారు. గ్రోక్‌ ద్వారా చట్టవిరుద్ధ కంటెంట్‌ సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ చాట్‌బాట్‌ తయారు చేస్తున్న కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని భారత ఎలక్ట్రానిక్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వశాఖ ఎక్స్‌కు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.